కోల్కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీలోని నేతలు రకరకాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతోపాటు పార్టీ నుంచి వెళ్లిపోతుండటం తెల్సిందే. వీరి వైఖరులను ఎండగడుతూ టీఎంసీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ గిర్గిటి(ఊసరవెల్లి)పేరుతో రాసిన ఓ కవితను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు నేతలు ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుతున్నారంటూ ఆ కవితలో ఆమె నర్మగర్భంగా పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని గంటల్లోనే వ్యక్తిత్వాలను, విధేయతలను మార్చుకునే కొందరు వ్యక్తులు ఊసరవెల్లి కంటే ప్రమాదకరంగా మారారని పేర్కొన్నారు.
‘మీ ప్రవర్తనను ఇంకెంతగా మార్చుకుంటారు? మీకు ఇంకెంత లంచం రావాలి? మిమ్మల్ని మీరు ఇంకెంతగా మారాలని అనుకుంటున్నారు?’అంటూ ఆ కవితలో మమత ప్రశ్నించారు. ఇందులో ఆమె ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. సమాజం, రాజకీయాల్లో కృతజ్ఞత, నైతిక విలువలు, మానవీయ స్పందనలు అంతరించిపోతున్నాయంటూ ఆవేదనతో వ్యక్తం చేశారు.


