ప్రధాని మోదీతో టిమ్‌ కుక్‌ భేటీ | Before Delhi Store Launch Apple CEO Tim Cook Meets PM Modi | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.. టిమ్‌ కుక్‌తో భేటీపై ప్రధాని మోదీ

Apr 19 2023 9:18 PM | Updated on Apr 19 2023 9:18 PM

Before Delhi Store Launch Apple CEO Tim Cook Meets PM Modi - Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ భేటీ అయ్యారు.. 

ఢిల్లీ: యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీలో గురువారం ఉదయం యాపిల్‌ రెండో స్టోర్‌ లాంఛ్‌ నేపథ్యంలో.. ఈ సాయంత్రం వీళ్ల భేటీ జరిగింది. భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేయగా.. దానికి టిమ్‌ కుక్‌ బదులు కూడా ఇచ్చారు. 

టిమ్‌ కుక్‌ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం. భారతదేశంలో జరుగుతున్న సాంకేతిక పరివర్తనలను హైలైట్ చేయడం ఆనందంగా ఉంది అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. దానికి టిమ్‌ కుక్‌ స్పందిస్తూ.. తనకు దక్కిన స్వాగతంపై ప్రధాని మోదీకి థ్యాం‍క్స్‌ తెలియజేశారు. భారత దేశ వృద్ధికి, పెట్టుబడులకు మేం పెట్టడానికి కట్టుబడి ఉన్నాము అంటూ ట్వీట్‌ చేశారు.  

ప్రధాని మోదీని కలవడానికి ముందు యాపిల్‌ సీఈవో కుక్‌, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ సాకేత్‌లో రేపు(ఏప్రిల్‌ 20వ తేదీన) రెండో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. ముంబై తొలి షోరూం ఓపెనింగ్‌ తరహాలోనే.. ప్రారంభం సందర్భంగా కస్టమర్లను స్వయంగా టిమ్‌ కుక్‌ ఆహ్వానించనున్నారు. అయితే ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ జియో వరల్డ్‌ డ్రైవ్‌లోని తొలి యాపిల్‌ షోరూంతో పోలిస్తే.. సాకేత్‌ షోరూం చిన్నదిగా తెలుస్తోంది. అయినప్పటికీ.. ముంబై తరహా లాంగ్‌ క్యూ అనుభవం ఇక్కడా ఎదురు కావొచ్చని యాపిల్‌ భావిస్తోంది.

రేపటి షోరూం లాంఛ్‌ కోసం బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు టిమ్‌ కుక్‌. తొలుత లోధి ఆర్ట్‌ డిస్ట్రిక్ట్ కు చేరుకున్నారాయన. అంతేకాదు దీనికి కారణమైన ఎస్టీఫ్లస్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విటర్‌ ద్వారా ఆ పర్యటన ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. గోవాకు చెందిన కళాకారుడు దత్తారాజ్‌ నాయక్‌ను ఈ సందర్భంగా టిమ్‌ కుక్‌ కలిశాడు. పబ్లిక్‌ ప్లేస్‌లో తమ కళను ప్రదర్శించేందుకు వీధి కళాకారులకు దక్కిన వేదికే ఈ లోధి ఆర్ట్‌ డిస్ట్రిక్ట్. దేశ్యవాప్తంగానే కాకుండా.. విదేశాలకు చెందిన 50 మంది కళాకారుల ఆర్ట్‌ వర్క్‌ ఇక్కడ కొలువు దీరింది. అటుపై నేషనల్‌ క్రాఫ్ట్స్‌ మ్యూజియం-హస్తకళా అకాడమీని సందర్శించారాయన. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement