Delhi AAP Councillor Video: మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. వీడియో వైరల్
Published
Wed, Mar 23 2022 3:50 PM
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా..
వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు.
ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు.