భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు
కష్టపడి చదవండి.. విజయంతో వినయంగా ఉండండి
గుంటూరు జిల్లా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో ప్రతీ విజేత ఎన్నో కష్టాలు, అపజయాలు ఎదుర్కొంటాడని, అవే మనిíÙని మరింత బలంగా తీర్చిదిద్దుతాయని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విద్యే జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం గురువారం ఢిల్లీలో ఆయన్ను కలిశారు. టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 41 మంది విద్యార్థులు ఉపరాష్ట్రపతి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, అధికారులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారని గుర్తుచేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిపెట్టాలని సూచించారు.
మహిళ శక్తి పెరుగుదలకు నిదర్శనం..
41 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల్లో 27 మంది బాలికలు ఉండటం దేశంలో మహిళా శక్తి పెరుగుదలకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి తెలిపారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను అతి తక్కువగా వినియోగించాలని చెప్పారు. క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మకతపై దృష్టిపెట్టాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ‘నిబద్ధతతో కష్టపడండి.. విజయంతో వినయంగా ఉండండి.. సమాజ శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని వినియోగించండి’ అనే మూడు సూత్రాలను జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు.


