ఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ గా ఎబోలాను ప్రకటించడంతో ఆందోళన మరింత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటి వరకూ ఎబోలా కేసులు నమోదు కాలేదని తెలిపింది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం, విమానాశ్రయాలు మరియు ఓడరేవుల్లో విదేశీ ప్రయాణికులకు కఠిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎబోలా కలకలం
ఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా, దక్షిణ సూడాన్లలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రాణాంతకమైన ‘బుండిబుగ్యో’ రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో, భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులను హెచ్చరించింది.
అత్యవసర పరిస్థితి
ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17న, ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’గా ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఈ వైరస్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) సైతం, దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ’గా పేర్కొంటూ కఠిన నిఘా ఉంచాలని సూచించింది.
ఎబోలా వ్యాప్తి ?
ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల రక్తం, వాంతులు, వీర్యం, చెమట, ఇతర శరీర ద్రవాలతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత, వ్యాధి తీవ్రత చాలా వేగంగా పెరుగుతుంది. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


