న్యూఢిల్లీ: సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాల తర్వాత జరగాల్సిన రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ప్రారంభం కావాల్సిన ఈ పోర్టల్, సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున 4:42 గంటలకు సీబీఎస్ఈ ఈ పోర్టల్ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది.
ఆలస్యమైన పోర్టల్ ప్రారంభం
సీబీఎస్ఈ తన పోర్టల్ను జూన్ 1న ప్రారంభిస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, సాంకేతిక లోపాల వల్ల అది సాధ్యపడలేదు. సోమవారం రోజంతా వెబ్సైట్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం బోర్డు అధికారులు వెబ్సైట్ త్వరలోనే లైవ్లోకి వస్తుందని ప్రకటించినప్పటికీ, అర్ధరాత్రి దాటిన తర్వాతే పోర్టల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
సైబర్ భద్రతపై సీబీఎస్ఈ దృష్టి
ఈ పోర్టల్ ప్రారంభానికి ముందు ‘ఆన్ మార్క్’ (OnMark) పోర్టల్లో కొన్ని భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల సమాచారం, పేపర్ల మూల్యాంకనంలో పారదర్శకతను పెంచేందుకు, సీబీఎస్ఈ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సైబర్ నిపుణులు, ఐఐటీ (IIT) నిపుణుల బృందాన్ని రంగంలోకి దించి, సిస్టమ్ను మరింత పటిష్టం చేసింది. అన్ని లోపాలను సరిదిద్ది, సర్వర్ను సురక్షితమైన వాతావరణంలోకి మార్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.
విద్యార్థులకు కీలక సూచనలు
రీ-ఎవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇప్పుడు అధికారిక పోర్టల్ ద్వారా తమ ప్రక్రియను కొనసాగించవచ్చు. ఒకవేళ ఇంకా ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, విద్యార్థులు సీబీఎస్ఈ టెలి-కౌన్సెలింగ్ హెల్ప్లైన్ నంబర్ 1800 11 8004 ద్వారా లేదా resultcbse2026@cbseshiksha.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని పారదర్శకంగా వినియోగించుకోవాలని బోర్డు సూచించింది.
ఇది కూడా చదవండి: 30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర


