నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బావిలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. దిండోరి పట్టణంలోని శివాజీ నగర్ ప్రాంతంలో శుక్రవారం (ఏప్రిల్ 3) రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బాధితులు ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. వేదిక సమీపంలోని ఒక బావిలో వారి కారు పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో అర్ధరాత్రి సమయంలో బావిలో నుంచి కారును, మృతదేహాలను బయటకు తీశారు.
మృతులను దిండోరి తాలూకాలోని ఇండోర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరణించిన వారిలో సునీల్ దత్తు దర్గుడే (32), రేష్మ (సునీల్ భార్య), ఆశా అనిల్ దర్గుడే (32), ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Nashik, Maharashtra: A car fell into a water-filled well in Shivaji Nagar, Dindori, last night, killing nine members of the same family. They were returning home after attending an event when the driver lost control and the car plunged into the well. Dindori police have… pic.twitter.com/mdHK6Tmftx
— ANI (@ANI) April 4, 2026


