Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు! | Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: 21వ శతాబ్దపు కౌరవులు!

Published Tue, Jan 10 2023 5:43 AM

Bharat Jodo Yatra: Kauravas of 21st century wear half pants says Rahul Gandhi - Sakshi

అంబాలా/చండీగఢ్‌: ఆరెస్సెస్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్‌ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని మండిపడ్డారు. భారతీయ విలువలకు సంఘ్‌ వ్యతిరేకమని ఆరోపించారు. సంఘ్‌ కార్యకర్తలు హర హర మహాదేవ్, జైశ్రీరామ్‌ అంటూ ఏనాడూ నినదించలేదని ఆక్షేపించారు. భారత్‌ జోడో యాత్రలో సోమవారం హరియాణాలోని అంబాలాలో ఆయన మాట్లాడారు. ‘‘మహాభారతం హరియాణాతో ముడిపడి ఉంది.

కౌరవులెవరు? మొదట 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెప్పబోతున్నా. వారు చేతిలో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని బిలియనీర్లు ఆ కౌరవుల ఎదుట సాగిలపడుతున్నారు. పాండవులెప్పుడైనా పెద్ద నోట్లను రద్దు చేశారా? తప్పుడు జీఎస్టీ అమలు చేశారా?’’ అని ప్రశ్నించారు. పాండవులు తపస్వులు గనుక ఎన్నడూ అలా చేయలేదన్నారు. పరస్పరం జైశ్రీరామ్‌ అంటూ పలుకరించుకోవాలని ప్రజలకు సూచించారు.

రాహుల్‌ ‘పూజారి’ వ్యాఖ్యలపై విమర్శలు
న్యూఢిల్లీ:తపస్వులకే తప్ప పూజారులకు భారత్‌లో స్థానం లేదన్న వ్యాఖ్యలతో రాహుల్‌ తమను చులకన చేశారంటూ ఆలయ పూజారులు మండిపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌ సహా పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.

Advertisement
Advertisement