టీకాకు అనుమతి

Bharat Biotech Gets Approval By DCGI-CDSCO For Emergency Use - Sakshi

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి గ్రీన్‌సిగ్నల్‌

మేలి మలుపు: మోదీ

కోవాగ్జిన్‌పై అనుమానాలు: కాంగ్రెస్‌

ఆ టీకా ఇచ్చాక దుష్ప్రభావాలు ఎదురైతే పరిస్థితి చేయి దాటుతుందని నిపుణుల హెచ్చరిక

హైదరాబాద్‌ టీకాకు ఆగమేఘాలపై కేంద్రం అనుమతివ్వడంపై కాంగ్రెస్‌ విమర్శలు

కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఎదురుదాడి

కీలకాంశాలపై రాజకీయం చేయడం అవమానకరమంటూ ట్వీట్‌

భారత్‌ సాధించే ఘనతలు కాంగ్రెస్‌కు ఎప్పటికీ గర్వకారణంగా అనిపించవన్న బీజేపీ చీఫ్‌ నడ్డా

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో నిర్ణయాత్మక ముందడుగు పడింది. కోవిడ్‌–19పై చేస్తున్న యుద్ధంలో భారతీయులకు సునిశిత ఆయుధం లభించింది. దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్‌’, బ్రిటన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’లకు షరతులతో డీసీజీఐ అనుమతించింది.

ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి తొలి అడుగు పడినట్లయింది. అలాగే, జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌కు కూడా డీసీజీఐ అనుమతించింది. ఈ టీకా అభివృద్ధి కోసం జైడస్‌ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్‌ వెల్లడించారు.

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలకు అనుమతి లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. కరోనా వైరస్‌పై భారత్‌ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు అని అభివర్ణించారు. ‘భారత్‌ ఆరోగ్యకర, కోవిడ్‌ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్‌ ఇండియా. టీకా కోసం అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు’అని ప్రధాని ట్వీట్‌ చేశారు. భారత్‌లో కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది.  మరోవైపు, ఈ టీకాలను ఆగమేఘాలపై అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. వాటి సమర్ధత, భద్రతలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  

సంపూర్ణ అధ్యయనం తరువాతే అనుమతి..
ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేíషించిన అనంతరం, నిపుణుల సిఫారసుల మేరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలకు  అత్యవసర పరిస్థితుల్లో నియంత్రిత వినియోగానికి అనుమతినివ్వాలని నిర్ణయించామని డీసీజీఐ వీజీ సోమానీతెలిపారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిని 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 70.42% సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపారు. 23,745 మంది వలంటీర్లపై చేసిన ‘కోవిషీల్డ్‌’ప్రయోగ ఫలితాల సమగ్ర వివరాలను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తమకు అందించిందన్నారు. కోవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ అత్యంత సురక్షిత వీరోసెల్‌ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిందని తెలిపారు. ఫేజ్‌ 1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని,  ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని సోమానీ వెల్లడించారు. ఫేజ్‌ 3 క్లినికల్‌ ట్రయల్‌ను  దేశవ్యాప్తంగా 22,500 మంది వలంటీర్లపై నిర్వహించారని, ఫలితాలు సానుకూలంగా వచ్చాయన్నారు.   

కోవాగ్జిన్‌ ప్రత్యామ్నాయమే!
భారత్‌ బయోటెక్‌ చేసినకోవాగ్జిన్‌ను ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని ఎయిమ్స్‌ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యుడు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ తొలిదశలో ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకానే వాడుతామన్నారు.  ‘వీటికి అనుమతులు లభించడం కొత్త ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న శుభ పరిణామం. ఈ రెండు టీకాలు చౌకైనవి. భద్రపరచడం, పంపిణీ సులువు. దేశీయంగా తయారైన వీటితో త్వరలోనే వ్యాక్సినేషన్‌ ప్రారంభించవచ్చు.

కోవిషీల్డ్‌ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున, సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించిన అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు’అని ఆయన అన్నారు. యూకే కరోనా కొత్త వేరియంట్‌ కేసులు దేశంలో అదుపుతప్పినా, లేదా మూడో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ పూర్తయినా.. కోవాగ్జిన్‌ను పూర్తిస్థాయిలో వాడే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీరం సంస్థ 5 కోట్ల డోసులు సిద్ధం చేసినందున, తొలి విడత వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మందికి కోవిషీల్డ్‌ వాడుతామన్నారు.

సమర్థతపై అనుమానాలు..
కరోనా విజృంభణను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన టీకాల సామర్ధ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిషీల్డ్‌ సమర్ధత 70.42%గా డీసీజీఐ ప్రకటించింది. కానీ కోవాగ్జిన్‌ సమర్ధతపై స్పష్టమైన వివరణ రాలేదు. అలాగే, ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, టీకా సమర్ధతపై, సురక్షితమేనా అన్న విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందకముందే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీకా వినియోగం ప్రారంభమైన తరువాత దుష్ప్రభావాలు వెల్లడైతే, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై ఈ టీకాలు ఎంతవరకు సమర్ధంగా పనిచేస్తాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తు చేస్తున్నారు. కోవాగ్జిన్‌ ఫేజ్‌ –3 క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైన సామర్ధ్యం, భద్రతలకు సంబంధించిన డేటా ఇంకా తమ వద్దకు రాలేదని ఆదివారం ఐసీఎంఆర్‌ కూడా స్పష్టం చేసింది. అయితే, కోవాగ్జిన్‌ అత్యున్నత సామర్థ్య, భద్రత ప్రమాణాలతో రూపొందుతున్న సంకేతాలున్నాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఫేజ్‌ 3 క్లినికల్‌ ట్రయల్స్‌  నివేదిక మరి కొన్ని వారాల్లో అందనుందన్నారు. కోవాగ్జిన్‌ ఫేజ్‌ 1, 2 ట్రయల్స్‌ ఫలితాలు సామర్ధ్యం, భద్రత పరంగా సానుకూలంగా ఉన్నాయన్నారు. ట్రయల్స్‌లో కోవాగ్జిన్‌ సమర్థతను నిరూపించుకుందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.

కోవాగ్జిన్‌కు అనుమతి ఎలా ఇచ్చారు: కాంగ్రెస్‌
కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీకా మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే అనుమతులివ్వడం ప్రమాదకరమని కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌ హెచ్చరించారు. అత్యంత కీలక అంశాన్ని రాజకీయం చేయడం అవమానకరమంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్‌ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ అన్నారు. తొలి విడతలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి టీకాలు ఇస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా కోవాగ్జిన్‌కు అనుమతులివ్వడాన్ని తప్పు పట్టారు.  అంతవరకు కోవిషీల్డ్‌ను వాడుకోవాలని సూచించారు. కోవాగ్జిన్‌ టీకా అంశంలో నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మరో నేత జైరాం రమేష్‌ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా స్వదేశీ టీకాకి అనుమతులివ్వడాన్ని స్వాగతించారు. శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు.  

కీలక అంశాల్లో రాజకీయాలా ?  
కాంగ్రెస్‌ నేతల ప్రశ్నలకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ట్విట్టర్‌ వేదికగా బదులిచ్చారు. ఇలాంటి కీలక అంశాల్ని రాజకీయం చేయడం అత్యంత అవమానకరమని అన్నారు.  ‘కళ్లు తెరిచి చూడండి ఇలా మాట్లాడి మీకు మీరే అభాసు పాలవుతున్నార’ని మంత్రి అన్నారు.  

బీజేపీ ఎదురు దాడి
కోవాగ్జిన్‌ అనుమతులపై  కాంగ్రెస్‌ నేతలు కేంద్రాన్ని నిలదీయడంతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్‌ ప్రతీది రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ విమర్శించారు. ఒకప్పుడు సైనికుల త్యాగాలను ప్రశ్నించారని, ఇప్పుడు స్వదేశీ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్‌ సాధించిన ఘనతలు ఎప్పటికీ కాంగ్రెస్‌కి గర్వకారణంగా అనిపించవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

కరోనా వైరస్‌పై భారత్‌ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు. ‘భారత్‌ ఆరోగ్యకర, కోవిడ్‌ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్‌ ఇండియా.  అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు.
– ప్రధాని మోదీ

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్‌ సహా కొత్త కరోనా వైరస్‌ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి.
– హర్షవర్ధన్‌ , ఆరోగ్య శాఖ మంత్రి

మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే వ్యాక్సిన్‌కు ఎలా అనుమతినిచ్చారు? ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించకుండా, మూడో దశ ప్రయోగాలపై ఫలితాలు తేలకుండా అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం.
– కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌

భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ తొలిదశలో ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకానే వాడతాం. కోవిషీల్డ్‌ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా
వాడుకోవచ్చు.  

 – డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, ఎయిమ్స్‌ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యుడు

భద్రత పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు.  ఈ టీకాలు 110% సురక్షితం. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీ కనిపించవచ్చు. ఏ వ్యాక్సిన్‌కైనా అది సాధారణమే.
– వి.జి. సోమానీ, డీసీజీఐ  

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్‌ సహా కొత్త కరోనా వైరస్‌ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి.
– హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top