చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి విమర్శలు చేశారు. విజయ్ను భవిష్యత్ ప్రధానిగా చూపిస్తూ టీవీకే మద్దతుదారులు చేస్తున్న ప్రచారంపై పళనిస్వామి వ్యంగ్యంగా స్పందించారు. “ఆయన అమెరికా అధ్యక్షుడు కూడా కావచ్చు. అందులో తప్పేమీ లేదు. అది ఆయన కోరిక” అని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం పాలనకు ప్రత్యామ్నాయం కాదని పళనిస్వామి అన్నారు. “ఇక్కడ రీల్స్ పెడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అక్కడ అది పనిచేయదు” అని వ్యాఖ్యానించారు. విజయ్ను ఖరీదైన ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాలనకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ ఖర్చులపై స్పందిస్తూ, “అమ్మ పాలనలో ఖర్చులు తగ్గించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టులను ప్రారంభించేవాళ్లం” అని పళనిస్వామి అన్నారు. రైతులా సాధారణ వ్యక్తిగా కనిపించేలా విజయ్ ప్రచారం చేసుకుంటూ, ఖరీదైన రీతిలో ప్రయాణిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర పాలన పూర్తిగా కుప్పకూలిందని పళనిస్వామి ఆరోపించారు. ఒక్క కోయంబత్తూరులోనే ఒక నెలలో దాదాపు 9 హత్యలు జరిగాయని చెప్పారు. “110 రోజుల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా కుప్పకూలింది. ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, ఘర్షణలు పెరుగుతున్నాయి” అని అన్నారు.
ఆర్థిక పరిస్థితిపైనా పళనిస్వామి విమర్శలు చేశారు. ఆర్థిక ఆధారం లేకుండా 110వ నిబంధన కింద పథకాలను నిర్లక్ష్యంగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఇదే స్థాయిలో అప్పులు కొనసాగితే రాష్ట్ర రుణభారం రూ.10 లక్షల కోట్లకు చేరవచ్చని హెచ్చరించారు. బియ్యం, చక్కెర, వంటనూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోలేదని అన్నారు.
అవినీతి పెరగడం, రైతులు, నర్సులు, ప్రజలు ఆందోళనలు చేయడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. డీఎంకే పాలన ముందుగానే ముగుస్తుందని పళనిస్వామి అంచనా వేశారు. ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగదని అర్థం చేసుకోవచ్చని అన్నారు.


