నిరుపేదలకు సన్నబియ్యం..
–8లో u
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కలెక్టరేట్లో మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, తెలంగాణ సాధన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ప్రసంగించారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆడబిడ్డలకు అండగా..
ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని.. అందుకే రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, మహిళాశక్తి క్యాంటీన్లు, శిల్పారామంలో 100 ఇందిరా మహిళశక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించామని.. ఇందులో ఇప్పటికే 150 బస్సులు అందజేసినట్లు తెలిపారు.
● జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా 2.73 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో దాదాపు రూ.132 కోట్ల మేర లబ్ధి పొందారన్నారు. 70,120 మంది లబ్ధిదారులకు 1,83,969 సిలిండర్లు రాయితీ ద్వార ఇచ్చి రూ.4.66 కోట్లను ఖాతాలో జమ చేశామని చెప్పారు.
రూ.421 కోట్ల రైతు భరోసా..
2025లో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మంది రైతులకు రూ.421 కోట్ల రైతుభరోసా నిధులు మంజూరు చేశామని, 6,526 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 1,151 నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు రూ.60 లక్షలతో ధన్వాడ మండలం కిష్టాపూర్లో 50 మంది లబ్ధిదారులకు విద్యుత్, బోర్లు, మొదటి పంటకు సాయం అందించినట్లు వివరించారు. నైపుణ్య కేటగిరిలో 35 మంది దళిత మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణనిచ్చి రూ.7 లక్షల విలువగల కుట్టుమిషన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.
● రాష్ట్రంలో మొట్టమొదట నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించామని.. విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2,438 సంఘాలకు రూ.237 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పారు. మక్తల్, నారాయణపేట, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో రూ.58.54 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. వన మహోత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో 25.82 లక్షల మొక్కలు నాటామన్నారు.
● లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.4,725 కోట్ల అంచనాలతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందజేస్తున్నామన్నారు. మక్తల్లో రూ.25 కోట్లతో 5 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.32.50 కోట్లతో 11 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నాబార్డ్ సౌజన్యంతో 22,500 ఎంటీఎస్ సామర్థ్యంతో 5 గోదాములు నిర్మిస్తున్నామని, 2025– 26 సంవత్సరానికిగాను పెద్ద సైజు చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో వదిలినట్లు చెప్పారు.
● పదోతరగతి వార్షిక పరీక్షల్లో 97.82 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 14వ స్థానం దక్కించుకుందన్నారు. సుమారు 30 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. యాసంగిలో 163 కొనుగోలు కేంద్రాల ద్వారా 17,460 మంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 1,27,531 మె. ట. వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు మంజూరుకాగా.. రూ.517 కోట్లతో పురోగతిలో ఉన్నాయన్నారు. ఎస్పీ, డీపీఓ కార్యాలయ భవన నిర్మాణానికి ఏడు ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.38 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరూ పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఆర్డీఓ రమేష్, ఎస్డీసీ రాజేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
జాతీయ పతకాన్ని
ఆవిష్కరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి.. చిత్రంలో కలెక్టర్ ప్రియాంక తదితరులు
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం
మహిళలు, పేదల సంక్షేమానికి
పథకాల అమలు
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
కలెక్టరేట్లో అట్టహాసంగా
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తోందని.. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.


