బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
కొత్తపల్లి(మద్దూరు): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర కార్యదర్శి బి.కృష్ణయాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం మద్దూరులో జాగృతిసేన జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కురుమయ్య అధ్యక్షతన బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీల జెండాలు వేరైనప్పటికీ బీసీలను రాజకీయంగా అణచివేయడంలో ఒకే ఎజెండా అమలు చేస్తున్నాయన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని నమ్మించి.. ఎన్నికల్లో బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 17 శాతమే రిజర్వేషన్లు కల్పించి మరోమారు మోసం చేసిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల హమీని అమలు చేయకపోయినా బీసీలు జనరల్ స్థానాల్లోనూ పోటీచేసి సత్తా చాటారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు గణేశ్, నాయకులు చిన్నయ్య, లాలప్ప, మొగులప్ప, భాస్కర్, రాము, రవి, మాణిక్యం తదితరులు ఉన్నారు.


