నిబంధనల మేరకు గుర్తుల కేటాయింపు
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఈసీ నిబంధనల మేరకు గుర్తులు కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల విత్డ్రా అనంతరం వివిధ రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఆయా గుర్తులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. వార్డుల వారీగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫైనల్ ప్రూఫ్ రీడింగ్ అనంతరం రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్స్ ముద్రణ చేయించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. అందులోని నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


