పట్టుదల,క్రమశిక్షణ ముఖ్యం
మహబూబ్నగర్ క్రీడలు: ప్రస్తుతం మహిళా క్రికెట్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో శనివారం ఉత్తరాఖండ్–హైదరాబాద్ ఇన్విటేషన్ మ్యాచ్ జరిగింది. తెలంగాణకు చెందిన మాజీ భారత మహిళా క్రికెటర్ గౌహర్ సుల్తానా మ్యాచ్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. ‘మహిళా క్రికెట్కు మంచి ప్రాచుర్యం లభిస్తోంది. మొదట్లో తాము ఆడుతున్నప్పుడూ వసతులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్లో పట్టుదలతో ఆడాలని, అదే సమయంలో క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. మహబూబ్నగర్ మైదానం చాలా బాగుంది. జింఖానా మైదానాన్ని పోలి ఉంది. ఔట్ ఫీల్డ్ చక్కగా ఉంది. ఔత్సాహిక మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మహబూబ్నగర్ మైదానంలో మ్యాచ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మ్యాచ్లు ఇక్కడి యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపుతుంది.
● నేను 1999లో మొదటగా హెచ్సీఏ అండర్–16 మ్యాచ్ ఆడాను. లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్గా దేశవాళీ క్రికెట్లో 200కి పైగా మ్యాచుల్లో దాదాపు 400 వికెట్లు తీసుకున్న. 2008 నుంచి 2015 వరకు భారత మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. భారత అండర్–21 జట్టు, సీనియర్ జట్టుకు ఆడాను. 2009, 2013లో మహిళల వన్డే ప్రపంచకప్, మూడు టీ–20 ప్రపంచకప్లు ఆడాను. 50 వన్డే మ్యాచ్లు ఆడి 66 వికెట్లు, 37 టీ–20కు మ్యాచుల్లో 29 వికెట్లు తీశాను. మిథాలీరాజ్ కెప్టెన్సీల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాను. 2023–24లో వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది ఆగస్టులో క్రికెట్కు రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం హెచ్సీఏ అండర్–19, అండర్–15 మహిళల జట్టుకు హెడ్కోచ్గా ఉన్నాను.
మహిళా క్రికెట్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది
ఎండీసీఏ మైదానం చాలా బాగుంది
భారత మహిళా మాజీ క్రికెటర్ గౌహర్ సుల్తానా


