ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదలకు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇచ్చిన లక్ష్యం.. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నియోజకవర్గం వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో వేగం పెంచాలన్నారు. పూర్తిగా వెనుకబడిన కృష్ణా మండలానికి సంబంధించి ఎంపీడీఓను వివరణ కోరారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకాలంలో హాజరుకావాలని, లేనిపక్షంలో వేతనంలో కోత విధించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. గ్రామాలకు ఆలస్యంగా వెళ్తున్న పంచాయతీ కార్యదర్శులను వివరణ అడిగారు. కారణాలు చెప్పకుండా పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. జాబ్కార్డులు ఉన్న ఉపాధి కూలీలకు సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. సమీక్షలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్ పాల్గొన్నారు.
పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియ
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని బూత్స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని, వారితో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్నాయక్, తహసీల్దార్ అమరేంద్రకృష్ణ, సి–సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


