యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి
నారాయణపేట: రాబోయే రోజుల్లో ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాబోతుందని.. యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు కదం తొక్కాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ జిల్లా సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ మరింత బలోపేతం కావాలంటే యువత ధైర్యంగా రాజకీయాల్లోకి రావాలని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులదేనన్నారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులుగా అవకాశాలు దక్కుతాయని, అందుకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ యువతకు అధికసంఖ్యలో స్థానాలు కేటాయించిందని.. రానున్న పురపాలిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యవర్గాన్ని ప్రకటించారు. అంతకుముందు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, పీసీసీ సభ్యులు చిట్టెం అజయ్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శివకుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ విజయ్కుమార్, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శివంత్రెడ్డి, కోట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తింపు
కోస్గి: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత రుణమాఫీ వర్తింపజేసిందని జిల్లా చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబు, ఏడీఓ లావణ్య తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఉన్ని సహకార సంఘంలో పని చేస్తున్న రెండు సొసైటీలకు రుణమాఫీ చెక్కులను అందజేసి మాట్లాడారు. పోతిరెడ్డిపల్లి సిల్క్ సంఘంలోని 17 మంది సభ్యులకు రూ. 8,24,454 లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
నేడు ఉచిత వైద్య శిబిరం
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని వీరసావర్కర్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఉచిత చర్మ సంబంధిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మెడికల్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గందె ఉమాకాంత్ తెలిపారు. ప్రముఖ డర్మటాలజిస్ట్ డా. శృతిశ్రీ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. ఉదయం 11 గంటలకు శ్రీసాయి ఆస్పత్రి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి


