ప్రలోభాల పర్వం షురూ
● ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
● మద్యం, నగదు పంపిణీకి యత్నాలు
నారాయణపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తూ వచ్చిన కొందరు.. అందిన కాడికి దండుకొనేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. తమ వాళ్లు ఐదుగురు హైదరాబాద్ నుంచి రావాలని.. బస్సులో వస్తే మధ్యాహ్నం 1గంట దాటుతుందని.. వారు కారు తీసుకొని వస్తారని.. కారు కిరాయి, టీ, టిఫిన్, భోజనం, డ్రైవర్ బత్తా కలిసి రూ. 10వేల వరకు అవుతుందని.. వారిని రమ్మంటావా.. వద్దంటావా అని అభ్యర్థులకు చెబుతుండటంతో పరేషాన్లో పడుతున్నారు. ఎవరూ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే.. కొందరు ముంబాయి, హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఉన్నారని చెబుతుండటంతో ఖంగుతింటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటు కీలకం కావడంతో అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
● మూడో విడత ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో పల్లెల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా మండలాల్లో బ్యాంకులు, ఏటీఎంలలో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం నుంచే మూతపడ్డాయి. అయితే అభ్యర్థులు ముందుగానే మద్యం నిల్వ చేసుకున్నారు.
● పోలింగ్కు 48 గంటల ముందుగానే ప్రచార కార్యక్రమాల నిషేధం అమలులోకి వచ్చింది. సభలు, సమావేశాల నిర్వహణ, స్పీకర్ల వినియోగం, ప్రచారం, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఐదుగురు వ్యక్తులు లేదా గుంపులుగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.


