
ఇందిరమ్మ ఇళ్లతో పేదోళ్ల ఆత్మగౌరవం నిలబెడతాం
అడ్డాకుల: ‘పేదోడి ఆత్మగౌరవం, భరోసా, భద్రత, గుండె నిండా ధైర్యం కావాలంటే ప్రతి ఒక్కరికి చిన్న ఇళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆనాటి ప్రభుత్వం పదేళ్లలో 94 వేల ఇళ్లకు టెండర్లు పిలిచి 76 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. మిగతావన్ని మొండి గోడలతో ఉంటే వాటిని పూర్తి చేసి బేషజాలకు పోకుండా వాటిని లబ్ధిదారులకు ఇస్తున్నాం. పేదోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నాం.’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో శనివారం ప్రమీల, పర్వతాలు దంపతుల ఇందిరమ్మ ఇళ్లును రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారు ప్రమీలతో కలిసి గృహప్రవేశం చేయించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు కొత్తబట్టలిచ్చి.. పాయసం తినిపించారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రంలో మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి ఇక అయిపోయిందనే కార్య క్రమం ఇది కాదు. ఇంకా మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఈ మూడు విడతల్లో అర్హులైన పేద వాళ్లను ఏ పార్టీ అని అడగం. మీది ఏ కులమ ని అడగం. ఇళ్లిచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా అని కూడా అడగం. వాళ్ల గుండెల్లో మేమిచ్చింది మంచి అని అనుకుంటే మాకు ఓటేస్తారు. ఓటు కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. ప్రతి సోమవారం నిర్మాణ దశల ప్రకారం బిల్లులను చెల్లిస్తున్నాం. ఆనాడు కమీషన్లు రావని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేదు. ఆనాడు హౌసింగ్ డిపార్టుమెంట్ను ముక్క చెక్కలు చేసి కకా వికలం చేశారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ హౌసింగ్ డిపార్టుమెంట్ను మరింత బలోపేతం చేస్తాం. ఆనాటి పెద్దలకు కళ్లు కుట్టే విధంగా చిన్న అవినీతికి తావు లేకుండా చేస్తాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తెచ్చాం. ఇప్పటికే జీపీఓలను ఇచ్చాం. దసరా నాటికి లైసెన్సుడు సర్వేయర్లను తెస్తాం. మీ కష్టార్జితంతో సంపాదించిన భూములకు భూభారతి ద్వారా భద్రత కల్పించే విధంగా రాబోయే రోజుల్లో భూభారతిని తీర్చిదిద్దుతాం’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మండల కాంప్లెక్స్లను త్వరలో మంజూరు చేసి వాటి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని మంత్రి ప్రకటించారు.
కేసీఆర్కు పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదు..
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు సంవత్సవానికి రూ.75 వేల కోట్ల అప్పు కడుతున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని చెప్పారు.
మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం
రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రేవంత్రెడ్డితోనే జిల్లా సస్యశ్యామలం:మంత్రి వాకిటి శ్రీహరి

ఇందిరమ్మ ఇళ్లతో పేదోళ్ల ఆత్మగౌరవం నిలబెడతాం