
ఎస్ఎస్వై సొమ్ము స్వాహా
మాగనూర్: జిల్లాలోని మాగనూర్ పోస్టాఫీసులో అవినీతి బాగోతం బయటపడింది. సుకన్య సమృద్ధియోజన ఖాతాదారుల సొమ్ము రూ.లక్షల్లో పక్కదారి పట్టింది. ఆడపిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు చమటోడ్చి సంపాదించి జమ చేసుకున్న సొమ్మును బీపీఎం ధనుంజయ్ అప్పన్నంగా కాజేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మాగనూర్ పోస్టాఫీసులో మొత్తం 760 ఖాతాలు ఉండగా.. అందులో ఎస్బీ 36, ఆర్డీ ఖాతాలు 552, సుకన్య సమృద్ధియోజన ఖాతాలు 172 ఉన్నాయి. వీరంతా కొన్నేళ్లుగా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ వస్తున్నారు. అయితే సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి 57 ఖాతాల్లో నిధుల గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ఖాతాదారుల పాస్పుస్తకాల్లో స్టాంఫ్ వేసి నిధులు జమ చేసినట్లు ఉండగా.. అధికారికంగా ఖాతాలో మాత్రం డబ్బులు జమ కాలేదు. పాస్పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఖాతాదారులు పొదుపు చేయడం లేదు.
బయటపడింది ఇలా..
మాగనూర్కు చెందిన సుకన్య సమృద్ధియోజన ఖాతాదారులు తొమ్మిదేళ్లుగా బీపీఎం ధనుంజయ్కు ప్రతినెలా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే వారి సొమ్ము బీపీఎం పోస్టల్ ఖాతాలో జమ చేయకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఖాతాదారుల పాస్పుస్తకంలో మాత్రం నగదు జమ చేసినట్లు స్టాంఫ్ వేసి ఇవ్వడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే గత జనవరి నుంచి అతడు గ్రామంలో పోస్టుకార్డుల పంపిణీ, ఇతర కార్యకలాపాలు నిర్వర్తించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు ఖాతాదారులు పోస్టాఫీసులో సంప్రదించారు. ఈ క్రమంలో వారు కట్టిన సుకన్య సమృద్ధియోజన డబ్బులు ఖాతాలో జమ కాలేదని గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. అప్పటికే బీపీఎం రూ. 6లక్షలకు పైగా డబ్బులు సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. వీటితో పాటు గ్రామంలోని కొందరు వ్యక్తుల నుంచి మరో రూ. 15 లక్షలకు పైగా డబ్బులు అప్పు రూపంలో తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా బీపీఎం గ్రామాన్ని వదిలేసి పోవడంతో మోసపోయామని తెలుసుకున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. మంగళవారం పోస్టాఫీసు వద్ద ఆందోళనకు దిగారు. బాఽ దితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సదరు బీపీఎంను సస్పెన్షన్ చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మాగనూర్ పోస్టాఫీసులో బీపీఎం చేతివాటం
రూ.లక్షలు పక్కదారి
ఆందోళనలో సుకన్య సమృద్ధియోజన ఖాతాదారులు
విచారణ చేపట్టిన అధికారులు