
భూ భారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమ వారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో లైసెన్స్డ్ సర్వేయర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతిలో నిరుద్యోగ లైసెన్స్డ్ సర్వే శిక్షణ పొందేందుకు జిల్లాలో ఐటిఐ, సివిల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి బ్యాచ్ కింద 109 లైసెన్స్డ్ సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజుల పాటు అనుభవజ్ఞులైన వారిచే సర్వే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి, హద్దులు, రెవెన్యూ చట్టాలు హక్కులపై తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
భూ సమస్యల పరిష్కారానికి
కర్ణాటక విధానం అమలు..
ఈ భూ సర్వే సమస్యల పరిష్కారానికి కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని మనం అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములు, లావాదేవిలు జరిగినప్పుడు సర్వే చేసి హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తర్వాత రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, దీని వల్ల తగదాలకు చోటు ఉండదని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు శ్రద్ధగా ఈ ట్రైనింగ్ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లాకు చెందిన మొదటి బ్యాచ్ 109 మందికి ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం శిక్షణ మెటిరియల్ను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీఐలు థాను, తయాబ్ సుల్తానా, సర్వేయర్లు రంగయ్య, జయశంకర్, కృష్ణయ్య, రవి, రాజన్న, అరుణ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్