బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్రెడ్డి దంపతులు ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా తాను నిరుపయోగంగా ఉన్న ఎస్సార్బీసీ స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేయగా బీసీ కోర్టు ద్వారా అడ్డుకున్నారన్నారు. చివరకు న్యాయస్థానంలో స్టే తొలగింపుతో పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగాయని, అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పట్టాల పంపిణీ జరగలేదన్నారు. నాడు ఎస్సార్బీసీ స్థలంలో పట్టాల పంపిణీ ప్రమాదమని పేర్కొన్న బీసీ జనార్దన్రెడ్డి నేడు అదే స్థలంతో పాటు పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమిలో ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని మంత్రి బీసీ పేర్కొనడం శోచనీయమన్నారు. దాత లు వెంకటేశ్వరస్వామికి భక్తితో దానంగా ఇచ్చిన భూమిని దేవాలయ అభివృద్ధికి వినియోగించాలన్నారు. మండలంలోని పలుకూరు గ్రామంలోని శివాలయానికి చెందిన 308 సర్వే భూమిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు యథేచ్ఛగా అక్రమమైనింగ్కు పాల్పడటంతో ఆలయ పూజారి జిల్లా కలెక్టర్, మైనింగ్ దేవదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా హిందూ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సంఘాలు, సంబంధింత అధికారులు స్పందించాల ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో తమకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో మంత్రి బీసీ జనార్థన్రెడ్డి దంపతులు పట్టణంలో ఇంటింటి వద్దకు వెళ్లిన సమయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వ భూమితో సంబంధం లేకుండా, తమ సొంత డబ్బుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రి బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు.
సొంత నిధులతో భూములు కొనుగోలు
చేసి పేదలకు పంపిణీ చేయండి
ఆలయ భూముల్లో మంత్రి అనుచరులు
దర్జాగా మైనింగ్
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి


