ఆళ్లగడ్డ: అహోబిల నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు తరలివచ్చారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీ సుదర్శన హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో ఈ కార్యాక్రమాన్ని ముగించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలంకరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు.


