కర్నూలు: కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ ఆజం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈయన తండ్రి అల్లాబకాష్ కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి షేకున్బీ గృహిణి. మహమ్మద్ ఆజం ప్రాథమిక విద్య కర్నూలులో, పెండేకంటి లా కళాశాల ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్డీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆజాం మాట్లాడుతూ.. జ్యుడీషియల్ పరీక్షలు రాయాలంటే కృషి, పట్టుదల ప్రధానమని, తల్లిదండ్రులు, చిన్నమ్మ, చిన్నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వంతో రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆజాంకు శుభాకాంక్షలు తెలిపారు.
జడ్జి ఉద్యోగం సాధించిన
రాచర్ల యువకుడు
ప్యాపిలి: లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని ఎందరో నిరూపిస్తున్నారు. ఇదే కోవలో రాచర్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచారు. రామచంద్రారెడ్డి, విజయలక్ష్మిల కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి రాచర్లలోనే పదో తరగతి, హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. పంజాబ్లోని నేషనల్ లా యూనివర్సిటీలో 2024లో బీఏఎల్ఎల్బీ హానర్స్ పూర్తి చేసి 2025 జనవరిలో జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకుని ప్రణాళికతో చదివారు. 2025 జూలైలో ప్రిలీమ్స్, అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు రాసి, 2026 మార్చిలో ఇంటర్వ్యూలో ప్రతిభ చాటారు. ఏప్రిల్ 2 వ తేదీ విడుదలైన సెలెక్షన్ జాబితాలో 250 మార్కులకు గాను 175.75 మార్కులు సాధించి జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి మేనమామ కంబిరెడ్డి స్ఫూర్తితో చదివినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జడ్జిగా ఎంపిక కావడం వెనుక తల్లిదండ్రుల పోత్సాహంతో పాటు మేనమామ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. తమ గ్రామానికి చెందిన యువకుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడంపై రాచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


