నంద్యాల: పట్టణ నడిబొడ్డున ఉన్న రూ. కోట్ల విలువ చేసే రెండెకరాల మార్కెట్ యార్డు భూమిని టీడీపీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి 33 ఏళ్ల పాటు తక్కువ ధరకు లీజుకు కేటాయించి రైతుల పొట్టకొడుతున్నారన్నారు. రైతుల కోసం ఉన్న మార్కెట్ యార్డ్ భూమిని తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి ఇవ్వడం దారుణమన్నారు. ఎకరాకు కేవలం ఏడాదికి రూ. వెయ్యికే లీజుకు ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని 33 ఏళ్ల పాటు అప్పనంగా అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. నంద్యాలలో టీడీపీ నేతల భూదాహంతో మార్కెట్ యార్డ్ స్థలాన్ని కూడా వదలడం లేదన్నారు. ఎకరాకు వెయ్యి రూపాయల లీజు అంటే అది ప్రభుత్వ ఆస్తిని దోచిపెట్టడం కాదా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై రైతుల తరుఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వివాదా స్పద నిర్ణయాలతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రెండేళ్లు గడిచినా నంద్యాలలో అభివృద్ధి శూన్యమని, కేవలం సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
పట్టణ నడిబోడ్డున ఉన్న రెండెకరాలకు
ఏడాదికి రూ.2 వేలకే లీజుకిస్తారా
అధికార దాహానికి అడ్డూ అదుపు లేదా?
మాజీ ఎమ్మెల్యే
శిల్పా రవి చంద్రకిషోర్రెడ్డి


