నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ కళాశా ల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియెట్ విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు డీఐఈఓ శంకర్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు హాల్టికెట్ ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చన్నారు. టీసీ సమర్పించిన తర్వాత అడ్మిషన్ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. 6వ తేదీన అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లకు గడువు ఉందన్నారు. మొదటి సంవత్సరం తరగతులు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, బీసీ వెల్ఫేర్ కళాశాలల్లో అన్నింటిలో 1వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు కళాశాలలు ఆఫ్డే నిర్వహిస్తారన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు కళాశాలలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు.
అన్నదాన పథకానికి రూ.3లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలు అందించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టి.అచ్యుత రామారావు రూ.లక్ష, తెనాలికి చెందిన కేఎన్వీఎస్వీ ప్రసాద్ రూ.లక్ష, అలాగే తెనాలికి చెందిన వై.శంకరబాబు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
ముగ్గురు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం 94 శాతం హాజరు నమోదైంది. 5,311 మందిలో 4990 మంది హాజరు కాగా 318 మంది గైర్హాజరయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా వారిని డిబార్ చేశామన్నారు.
1,031 పింఛన్ల కోత
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో 4,47, 648 పింఛన్లకు రూ.196.3 కోట్లు విడుదలయ్యా యి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 1,031 పింఛన్లపై కోత పడింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్లో ఏర్పాటైంది. దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త పింఛన్ల ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ హామీని కూడా కొండెక్కించడం గమనార్హం.


