కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీ పక్కన జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను ఆదివారం వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇటుకల బట్టీల కోసం ప్రొక్లెయిన్ల ద్వారా మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తుండటంతో కాలనీవాసులు ఆ పనులను నిలిపి వేయించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ.. కాలనీ పక్కనే ఉన్న పొలాల్లో గతంలో మట్టిని తవ్వడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ చేరి గడిచిన పది సంవత్సరాల కాలంలో దాదాపు ఏడుగురు పిల్లలు నీటి గుంతల్లో పడి మృతి చెందారన్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా కొందరు వ్యక్తులు ఆదివారం మట్టి తవ్వి తరలించుకపోతున్నారన్నారు. పొలాల్లో మట్టి తవ్వగా గుంతలు ఏర్పడి మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకోనే ఆస్కారం ఉందన్నారు. సంబంధిత అధికారులు మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ రఘు, అరదేశి దేవా, కాలనీవాసులు పాల్గొన్నారు.


