కర్నూలు(సెంట్రల్): ఇంటి జాగైనా ఇవ్వూ లేదంటే అద్దైనా చెల్లించూ బాబూ అంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహిళలు కదం తొక్కారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ మేరకు సొంతిల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలను సీపీఐ శ్రేణులు ముట్టడించారు. కర్నూలులో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అధికారంలో లేని సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మిస్తారన్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సెంటు స్థలం తమ బాత్రూం అంతా కూడా లేదంటూ వ్యంగ్యం చేశారని, ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. తనకు కావాల్సిన పారిశ్రామిక వేత్తలకు 99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరారు. రాష్ట్రంలో భూములు తీసుకున్న పారిశ్రామికవేత్తలు ఎన్ని పరిశ్రమలు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు అవుల శేఖర్, కె.జగన్నాథం పాల్గొన్నారు.


