నంద్యాల: లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు, నంద్యాల పట్టణంలోని విజయ పాల డెయిరీ సమీపంలో రూ.2.40 లక్షల వ్యయంతో, గంటకు వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆధునిక ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు. తమ విజ్ఞప్తిని గౌరవించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్ను లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆదాయ పెంపులో జిల్లాను
ముందంజలో నిలపాలి
జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా తదితర విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదాయ వృద్ధి సాధించేందుకు ప్రతి శాఖ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో రూ.15 వేలకుపైగా వేతనం పొందుతున్న ఉద్యోగుల నుంచి ప్రొఫెషనల్ టాక్స్ వసూలు చేయడానికి అవసరమైన వివరాలను సేకరించి సమర్పించాలన్నారు. అదే విధంగా జిల్లాలో గ్యాస్ కొరత లేదని పేర్కొంటూ ప్రత్యామ్నాయంగా వినియోగించే విద్యుత్ ఉపకరణాలు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు.


