నంద్యాల: ఆర్డీఎస్ఎస్ పథకం కింద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాల పనులను వేగవంతం చేసి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఎస్ఎస్ పథకం అమలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందిస్తూ నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా విద్యుత్ ట్రిప్పులు తగ్గించి, లో వోల్టేజ్ సమస్యలను నివారిస్తూ స్థిరమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాటు చేసిన 15 విద్యుత్ స్తంభాల పనులను కూడా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. టోల్ గేట్ల పరిసరాల్లో అధిక సాంద్రత తో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని రైతుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ కార్తీక్, శ్రీశైలం సబ్ డీఎఫ్ఓ బబితా కుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి


