
గిరిజన ఆటోడ్రైవర్లకు ఎల్ఎల్ఆర్
ఆత్మకూరు: ఆధార్, రేషన్కార్డు ఆధారంగా గిరిజనులకు ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తున్నట్లు ఆర్టీఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కొట్టాల చెరువు, పెచ్చెరువులోని 60 మంది గిరిజన ఆటో డ్రైవర్లకు ఈ కార్డులను బుధవారం ఆత్మకూరు పట్టణంలో అందించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ చెంచుగూడాల నుంచి ఆటోల్లో ఆత్మకూరుకు వచ్చేటప్పుడు లైసెన్సులు లేక గిరిజన డ్రైవర్లు ఇబ్బందులు పడేవారన్నారు. వారికి ఎల్ఎల్ఆర్ కార్డులు ఇవ్వడంతో సమస్య పరిష్కారమయ్యిందన్నారు.
డోన్లో జీబీఎస్ కేసు
డోన్ టౌన్: పట్టణంలోని ఒక మహిళకు గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) అనే వ్యాధి సోకినట్లు కుటుంబ సభ్యులు బుధవారం విలేకరులకు తెలిపారు. కుట్టు మిషన్పై ఆధారపడి జీవించే ఈ మహిళక తీవ్ర నరాల నొప్పి రావడంతో ఈ నెల 2న కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్లారన్నారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వ్యాధి నిర్ధారించినట్లు తెలిపారు.
పంట మార్పిడి ఎంతో మేలు
నంద్యాల(అర్బన్): పంట మార్పిడి రైతుకు ఎంతో మేలు చేస్తుందని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు వెంకటరమణ, ప్రజనన, చైతన్య తెలిపారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో మొక్కజొన్న, వరి పొలాలను రైతులతో కలిసి బుధవారం వారు పరిశీలించారు. ఖరీఫ్లో మినుము వేసిన పొలంలో రబీలో మొక్కజొన్న వేయాలన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నను కత్తెర పురుగుతో పాటు గొంగళి పురుగులు ఆశించాయని, ఎకరాకు క్లూరాంట్రినిప్రోల్ 60మి.లీ, ఇమో మేక్టీన్ బెంజోయెట్ 80గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు.
టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా విజయ్కుమార్
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా అటవీ సంరక్షణాధికారి, టైగర్ ప్రాజక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా బి. విజయ్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగి నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ప్రకృతి సంపదలైన అడవులను సంరక్షించే భాధ్యత అటవీశాఖ ఉద్యోగులపై ఉందన్నారు. గతంలో తాను రాజమండ్రిలో పని చేసినట్లు చెప్పారు.
నాల్గో విడత ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో నాల్గో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27లోపు www.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28వ తేదీన వెరిఫికేషన్ చేసి, ప్రభుత్వ కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29వ తేదిన.. ప్రైవేటు కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత కాలేజీల్లో 30వ తేదిన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఉల్లి పంట పరిశీలనకు గ్రామ, మండల స్థాయి టీంలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సాగైన ఉల్లి పంట స్థితిగతులను పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసింది. గ్రామస్థాయిలో వీఆర్వో, రైతుసేవా కేంద్రాల ఇన్చార్జీలతో కమిటీలు ఏర్పాటయ్యాయి. మండల స్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, హార్టికల్చర్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఉద్యాన పంటల పరిస్థితి ఎలా ఉంది.. అధిక వర్షాలకు దెబ్బతినిందా.. వారానికి ఎన్ని టన్నులు మార్కెట్కు వస్తుంది తదితర వివరాలపై టీంలు సర్వే చేస్తాయి. గ్రామస్థాయి టీంలు చేసే సర్వేను మండల స్థాయి టీమ్లు పర్యవేక్షిస్తాయి. ఈ నెల 20వ తేదీలోపు సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్కు రిపోర్టు ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి గ్రామ, మండల స్థాయి టీంలను ఆదేశించారు.

గిరిజన ఆటోడ్రైవర్లకు ఎల్ఎల్ఆర్

గిరిజన ఆటోడ్రైవర్లకు ఎల్ఎల్ఆర్