
రంకేసిన ఒంగోలు గిత్త!
నంద్యాల(అర్బన్): నడకలో దర్పం.. రాజసం.. ఉత్తమమైన బల ప్రదర్శన.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఒంగోలు ఎద్దులు ఖండాంతరాలు దాటి ఖ్యాతిని సాధించాయి. ఈ వృషభ సంతతి వృద్ధికి నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం విశేష కృషి చేస్తోంది. ఒంగోలు జాతి వీర్యోత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేకపోగా.. నంద్యాల ఎఫ్ఎస్బీ (ప్రాజెన్ సెమన్ బ్యాంక్)లో ఒంగోలు జాతి వీర్యోత్పత్తి ఆశాజనకంగా ఉంది. ఇక్కడి అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉంది. ఒంగోలు ఎద్దుల నుంచి సేకరించిన డోసులో ఒక్కోదాంట్లో 0.25 ఎంఎల్కు 20 మిలియన్ శుక్రకణాలు ఉంటేనే నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలోనూ మైనస్ 196 డిగ్రీల నైట్రోజన్ని కచ్చితమైన సమయానుసారం ఉంచుతున్నారు. దీంతో పాటు పశువుల పాకలు, దాణా, టీకాల విషయంలో రాజీ లేకుండా ఉంటుండటంతో చక్కని ఫలితాలు రాబడుతున్నారు.
ఆధునిక సాంకేతికత
నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం ద్వారా పలు పశుజాతుల నుంచి 15.60 లక్షల డోసుల్ని సేకరిస్తున్నారు. నెలకు సగటున 1.30 లక్షల డోసులను సేకరిస్తున్నారు. దీనికోసం ఫ్రాన్స్కు చెందిన అధునాతన విదేశీ పరికరాల్ని వాడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 14 లక్షల డోసుల వీర్య నాళికలు భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచారు. ఈ మధ్య కాలంలో పశు గణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకుంటున్న ఎస్ఎస్ఎస్(సెక్స్ సోర్టెడ్ సెమన్) ద్వారా కేవలం పెయ్య దూడలు జన్మించే విధానాన్ని ఈ కేంద్రం సైతం అందిపుచ్చుకుంది. దీనికోసం ఉత్తరాఖండ్, పూణె నుంచి 12వేల ఈ రకం డోసుల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడి సిబ్బంది. పనితీరును విజయవాడ వీబీఆర్ (వెటర్నరీ బయలాజికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్) ఆరు నెలలకొకసారి, ఎస్ఆర్డీడీఎల్ అధికారులు సంవత్సరానికొకసారి వచ్చి తనిఖీలు చేస్తారు. అత్యుత్తమ పనితీరుతో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ నుంచి నంద్యాల ఎఫ్ఎస్బీ రెండుసార్లు ఏ గ్రేడ్ సాధించింది.
రూ.9.36 కోట్లతో
పలు అభివృద్ధి పనులు
నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలు మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పశువుకి విడిగా షెడ్లు, సిబ్బంది గదులు, అధునాతన సాంకేతిక పరికరాల కొనుగోలు తదితరాలకు వీటిని వెచ్చించనున్నారు. రూ.9.36 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ఆధునిక సాంకేతికతతో శ్రేష్టమైన జాతుల పశు ఉత్పత్తికి ఘనీకృత వీర్య కేంద్రం విశేష కృషి చేస్తోంది. ఒంగోలు జాతికి సంబంధించిన వీర్యోత్పత్తి మా కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఆశాజనకంగా లేదు. కాలానుగుణంగా పశు వైద్యంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకుంటూ రైతులకు నాణ్యమైన సేవలందిస్తాం.
– డాక్టర్ రమణమూర్తి, సహాయ సంచాలకులు, ఘనీకృత వీర్య కేంద్రం, నంద్యాల
సేవలు ఇలా...
నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం 1976లో ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా పశుగణాభివృవృద్ధి సంస్థ పర్యవేక్షణలో పనిచేసే మూడు ఉప కేంద్రాల్లో ఇదొకటి.
అంటు వ్యాధులు లేని, మేలుజాతి పశువుల నుంచి కృత్రిమ పద్ధతుల్లో సేకరించిన నాణ్యమైన వీర్యాన్ని రైతులకందివ్వటం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
కేంద్రం నుంచి ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలకు నిల్వ చేసిన వీర్య నాళికల్ని పంపుతున్నారు.
ఒంగోలు, ముర్ర, పుంగనూరు, మల్పాడ గిత్త, గిర్, షాహివాల్ జాతుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు.
పలు జాతులకు చెందిన 81 ఆబోతులు, ఎడ్లను సంరక్షిస్తున్నారు.
రైతుల డిమాండ్కు అనుగుణంగా దేశీయ జాతులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు.
‘రాజసానికి’ ఊపిరి పోస్తున్న
నంద్యాల ఎఫ్ఎసీబీ కేంద్రం
ఆధునిక సాంకేతికతతో
ఒంగోలు ఎడ్ల కృత్రిమ వీర్యోత్పత్తి
సెంట్రల్ మానిటరింగ్ యూనిట్
నుంచి రెండుసార్లు ఏ గ్రేడ్
రూ.9.36 కోట్ల విలువైన మౌలిక
సదుపాయాల కల్పన పనులు

రంకేసిన ఒంగోలు గిత్త!