
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేస్తాం
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. సోమవారం బొమ్మలసత్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 86 ఫిర్యాదులు అందుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, భూకబ్జాలు, పొలం తగాదాలు తదితర కేసులకు సంబంధించి ఫిర్యాదు అందాయన్నారు.