
నంద్యాల: యాంత్రికరణ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం తగ్గించి లాభాలు పెంచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పేర్కొన్నారు. రైతులు కేవలం 10 శాతం డబ్బులు కడితే 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంతో ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా చుట్టుగుంట సర్కిల్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్ధాయి వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి తదితరులు వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ మాట్లాడుతూ ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 153 గ్రూపులకు 114 ట్రాక్టర్లు 4 వరి కోత యంత్రాలు పంపిణీ చేసిందన్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 36 గ్రూపులకు రూ.151.74 లక్షలు, బనగానపల్లెలో 39 గ్రూపులకు రూ.132 లక్షలు, డోన్లో 20 గ్రూపులకు రూ. 515.41 లక్షలు, నందికొట్కూరులో 25 గ్రూపులకు 748.18 లక్షలు, నంద్యాలలో 12 గ్రూపులకు 473.33 లక్షలు, పాణ్యంలో 9 గ్రూపులకు రూ. 388.62 లక్షలు, శ్రీశైలంలో 12 గ్రూపులకు 492.79 లక్షలు మొత్తం 153 రైతు గ్రూపులకు రూ. 5.45 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఈ క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
● శాసనమండలి సభ్యులు ఇసాక్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం విత్తు నుంచి పంట కోత వరకు రైతులకు అండగా ఉంటుందన్నారు. వరి కోత మిషన్లపై 8.80 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతులకు పంట సాగుకు ముందే పెట్టుబడి సాయం అందజేయడమే కాకుండా వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తూ అన్ని రకాలుగా అండగా జగన్మోహన్రెడ్డి నిలుస్తున్నారన్నారు.
● జిల్లా వ్యవ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్రెడ్డి మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. వ్యవసాయ కూలీల కొరతను నివారించేందుకు రైతులకు వ్యవసాయ వాహన, యంత్ర పరికరాలు పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. గ్రామస్థాయిలోని రైతు భరోసా కేంద్రాల పరిధిలో సన్న, చిన్న కారు రైతులు గ్రూపుగా ఏర్పాటై రిజిస్ట్రేషన్ చేసుకుంటే ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు మంజూరు చేస్తారన్నారు.
● ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ తక్కువ ధరకే రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు. పంట సాగు నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అన్ని రకాలుగా అండగా సీఎం జగన్మోహన్రెడ్డి ఉంటున్నారన్నారు. అనంతరం పంపిణీ చేసిన ట్రాక్టర్లు, వరి కోత మిషన్ల వాహనాలకు కలెక్టర్, ఎమ్మెల్సీ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాయితీ మొత్తంతో కూడిన చెక్కును రైతులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, పట్టు పరిశ్రమ అధికారి పరమేశ్వరి, వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మనజీర్
జిలానీ శామూన్
వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద
114 ట్రాక్టర్లు, 4 వరి కోత
యంత్రాలు పంపిణీ
153 సీహెచ్సీ గ్రూపులకు
రూ.5.45 కోట్ల సబ్సిడీ విడుదల
సీహెచ్సీ గ్రూపు ప్రతినిధులకు
మెగా చెక్కు అందజేత

కలెక్టరేట్ వద్ద బారులుదీరిన యంత్రసేవా పథకం ట్రాక్టర్లు