నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమంగా భర్తీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను వెంటనే రద్దు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంజీయూ విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తెలిపారు. రోస్టర్ పాటించకుండా పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నాయకులు పొలగోని శివ, రాజేష్, యశ్వంత్, రామ్, జితేందర్, సంజీవ, నిరుద్యోగులు తదితరులు ఉన్నారు.


