రామగిరి(నల్లగొండ) : ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగను సందర్భంగా నల్లగొండ పట్టణం మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వెంకట్రెడ్డితోపాటు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశ్వాసానికి, త్యాగ నిరతికి బక్రీద్ నిదర్శమన్నారు. దేశంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ ద్వేషాన్ని వీడండి – దేశాన్ని జోడించండి (నఫ్రత్ ఛోడో – భారత్ జోడో) అనే గొప్ప నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా నల్లగొండలో గంగా–జమునా తహజీబ్ తరహాలో రంజాన్, బక్రీద్, దసరా పండుగలను సోదరభావంతో జరుపుకుంటున్నామని చెప్పారు. త్వరలో భూమిని కేటాయించి షాదిఖానాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఏఎస్పీ రమేష్, డిప్యూటీ మేరకు ఎండీ.అష్రఫ్ అలీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.హఫీజ్ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి


