బీజేపీ సీనియర్లకు భంగపాటు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులకు భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఆశించే నాయకులు సైతం వారి డివిజన్లను గెలుపించుకోలేకపోయారు. 48 డివిజన్లకు గాను 45 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావుతో సైతం నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్లో సభ పెట్టించారు. కానీ 45 డివిజన్లకు గాను కేవలం నాలుగింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఆరు స్థానాలు ఉండగా, ప్రస్తుతం రెండు తగ్గిపోయాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి సొంత తమ్ముడు హర్షిత్రెడ్డిని 10వ డివిజన్ నుంచి బరిలో నిలిపినా గెలుపించుకోలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుతో పోటీ చేసి ఓటమి చెందిన పిల్లి రామరాజు యాదవ్ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 8వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన సతీమణి పిల్లి సత్యవతిని గెలుపించుకోలేకపోయారు. మరో సీనియర్ నేత గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, బండారు ప్రసాద్, వీరెళ్లి చంద్రశేఖర్ తదితర ముఖ్య నాయకులు సైతం వారు నివాసం ఉండే సొంత డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసినట్లు చర్చ సాగుతోంది.
ఫ నల్లగొండ కార్పొరేషన్లో వికసించని కమలం


