మార్చి నాటికి ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు
కలెక్టరేట్లో సమీక్ష
చిట్యాల : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మార్చినాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు స్వప్న, సంతోష, కళమ్మతో మాట్లాడారు. బిల్లుల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులు ప్రమీల, సత్యనారాయణతో మాట్లాడారు. పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విపి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే మంజూరు చేస్తుందని అంతకుమించి అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేసుకొని ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయిన వెంటనే మరుగుదొడ్డి నిర్మాణానికి బుక్ చేయించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయించాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ జయలక్ష్మి, ఏఈ ప్రీతి, గ్రామ పంచాయతీ సర్పంచ్ కాటం వెంకటేశం ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
నార్కట్పల్లి : మండలంలోని జువ్విగూడెం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను, దాసరిగూడెం, ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ మంగళవారం పరిశీలించారు. ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీఓ సుధాకర్, సర్పంచ్ చింత అనిల్కుమార్, హౌసింగ్ ఏఈ ఇందు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ విపి.గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. డబుల్బెడ్ రూమ్ గృహ సముదాయాల్లో కరెంటు, తాగునీరు, డ్రెనేజీ, అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించాకే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ బి.చంద్రశేఖర్తో కలిసి నల్లగొండలోని కలెక్టరేట్ వెనక గొల్లగూడెం వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు.
మార్చి నాటికి ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు


