ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి గోదాములో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. పోలింగ్ రోజున ఉదయం 6.45 గంటలకు ఏజెంట్ల ఎదుట బ్యాలెట్ బాక్స్ను తెరవాలన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు, జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరుగుతుందన్నారు. 3,09,097 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికలకు 2855 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేసేలా అవగాహన కల్పించామన్నారు. నల్లగొండ కార్పొరేషన్కు సంబంధించి ఆర్జాలబావి గోదాములో, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్ఎల్బీసీ సమీపంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశామని వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


