పట్టణాల్లో నాకాబందీ
స్ట్రాంగ్ రూమ్ల వద్ద
మూడంచెల భద్రత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పోలింగ్కు ముందు రోజు నుంచే డివిజన్లు, వార్డుల్లో నాకాబందీ నిర్వహిస్తాం. మూడు నాలుగు వార్డులకు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేసి డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూస్తాం’ అని ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తోపాటు చండూరు, చిట్యాల, దేవరకొండ, నాగార్జునసాగర్, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టబోయే చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఎస్పీ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..
జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 162 వార్డుల్లో 164 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. ఇందులో 65 లొకేషన్లను క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించాం. వాటిల్లో గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రిగ్గింగ్, క్రాస్ ఓటింగ్ వంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో రూట్ మొబైల్ బృందాలను నియమిస్తాం. జిల్లాలో రెండు వేల మందితో స్పెషల్ పోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. వారంతా బందోబస్తులో పాల్గొంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తాం.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడుతున్నాం. 300 మంది పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్ చేశాం. మున్సిపాలిటీల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి కదలిలకపై నిఘా పెట్టాం. రోజూ పిలిపించి చెక్ చేస్తున్నాం. కార్పొరేషన్తోపాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 81 మంది నుంచి ఆయుధాలను డిపాజిట్ చేయించాం.
గతంలో గొడవలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో నాయకులు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. గతంలో నేరాలకు పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎలాంటి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తాం. ఏమైనా సంఘటనలు జరిగితే స్థానిక ప్రజలు కూడా డయల్ 100 ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వండి. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఓటు వేయకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే విధంగా ఆలోచించి ఓటు వేయండి.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 3 వార్డులకు కలిపి ఒకటి చొప్పున చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 24 గంటలపాటు తనిఖీలు జరుగుతాయి. పోలింగ్కు ముందు డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఓటర్లను ఇతర ప్రలోబాలకు గురి చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో మున్సిపాలిటీలో డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. మిర్యాలగూడ, హాలియా, నందికొండ ప్రాంతాల్లో ఏఎస్పీ ఇన్చార్జి వ్యవహరిస్తాను. నేను నల్లగొండతో పాటు చండూరు, చిట్యాల, దేవరకొండ ప్రాంతాలు పర్యవేక్షిస్తా. ఇప్పటికే పలుచోట్ల తనిఖీలను ముమ్మరం చేశాం.
మిర్యాలగూడతో పాటు నందికొండ, హాలియా మున్సిపాలిటీలకు అవంతీపురం మార్కెట్ యార్డులో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల కౌంటింగ్ను నల్లగొండ సాగర్ రోడ్డులోని రామానందతీర్థ నిడమనూరు గురుకుల పాఠశాల కేంద్రంలో ఏర్పాటు చేశారు. నల్లగొండ కార్పొరేషన్ కౌంటింగ్ను ఆర్జాలబావిలోని వేర్ హౌజింగ్ గోదాములో ఏర్పాటు చేశారు. పోలింగ్ తరువాత బ్యాలెట్ బాక్సులను అక్కడి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అక్కడ మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తాం.
ఫ మూడు నాలుగు వార్డులకు ఒక చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తాం
ఫ డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాం
ఫ ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం
ఫ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. స్వేచ్ఛగా ఓటెయ్యాలి
‘సాక్షి’తో ఎస్పీ
శరత్చంద్ర పవార్
పట్టణాల్లో నాకాబందీ


