బోనస్ కాజేసేందుకు పన్నాగం
మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయిస్తే ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించగా దాన్ని కాజేసేందుకు కొందరు అడ్డదారులు తొక్కారు. తమ పొలాల్లో పండిన సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించకుండా అనధికారికంగా ట్రక్ షీట్ రాయించుకుని నేరుగా మిల్లుకు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ, త్రిపురారం మండలానికి చెందిన ఇద్దరు రైతులు తమ పొలంలో పండిన 741బస్తాలు(296 క్వింటాళ్ల) ధాన్యాన్ని మిర్యాలగూడలోని అవంతీపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు ట్రక్షీట్ రాయించుకుని మిర్యాలగూడలోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. కాగా ఆ కొనుగోలు కేంద్రంతోపాటు ఇతర ఏ కొనుగోలు కేంద్రాల్లోనూ ఇప్పటివరకు సన్నరకం ధాన్యాన్ని గింజ కూడా కొనుగోలు చేయలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అవంతీపురం కొనుగోలు కేంద్రంలో 296 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించి మిల్లుకు తరలించడంతో బోనస్ను కాజేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ఫ సన్నధాన్యం నేరుగా మిల్లుకు తరలింపు.. కొనుగోలు
కేంద్రం నుంచి ట్రక్షీట్
ఫ అవంతీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన


