
గుజరాత్ నుంచి నల్లగొండకు బ్యాలెట్ బాక్సులు
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నందున జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులు సరిపోయే అవకాశం లేదు. దీంతో గుజరాత్ నుంచి 4280 బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. వాటిని శుక్రవారం నల్లగొండలోని జిల్లా పరిషత్ పాత భవనంలో భద్రపరిచారు. బ్యాలెట్ బాక్సులను జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు పరిశీలించారు.
రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పీజీ సెమిస్టర్ పరీక్షలను అధికారులు తనిఖీ చేశారు. యూనివర్సిటీలో పరీక్ష కేంద్రాలను వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్రెడ్డి పర్యవేక్షించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
చిట్యాల : వానాకాలం వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చిట్యాల పీహెచ్సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఆనంతరం మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ఇటీవల డెంగీ వ్యాధి సోకిన ఇంటి పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైడే నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డీఎంఓ ప్రదీప్, డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, సీహెచ్ఓ నర్సింహారావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కేజీబీవీ తనిఖీ
హాలియా : పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ బొల్లారం భిక్షపతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన హైజెనిక్ ఆహార పదార్థాలను అందించాలని స్పెషల్ ఆఫీసర్ హైమావతికి సూచించారు. స్టోర్, కిచెన్, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థుల ప్రగతిని సమీక్షిస్తూ గుణాత్మకమైన విద్యను అందించాలని సూచించారు.
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి.

గుజరాత్ నుంచి నల్లగొండకు బ్యాలెట్ బాక్సులు

గుజరాత్ నుంచి నల్లగొండకు బ్యాలెట్ బాక్సులు