
గ్రామీణ రోడ్ల అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గ్రామీణ రోడ్లును హైబ్రీడ్ ఆన్యూటీ మోడ్లో (హ్యామ్) అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రోడ్లను విస్తరిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవ
హ్యామ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి మొదటి మూడు ప్యాకేజీల్లోనే అవకాశం కల్పించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్అండ్బీ శాఖ మంత్రి కావడంతో జిల్లా రోడ్లను మొదటిలోనే అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో 17 ప్యాకేజీలుగా రోడ్ల అభివృద్ది, విస్తరణ చేయనుండగా, అందులో మూడు ప్యాకేజీల్లో ఉమ్మడి జిల్లాలోని 60 రోడ్ల అభివృద్ధికి అవకాశం కల్పించారు.
సర్కిల్–1లో ఐదు నియోజకవర్గాల్లో..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక ప్యాకేజీగా తీసుకున్నారు. మొదటి సర్కిల్లో రూ.302.45 కోట్లతో 18 రోడ్లను అబివృద్ధి చేయనున్నారు. నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 223.12 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టనుండగా.. ఇందులో 38.4 కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్లుగా విస్తరించనున్నారు.
సర్కిల్–2లో ఏడు నియోజకవర్గాలు..
నల్లగొండ సర్కిల్–2 పరిధిలో 26 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక సర్కిల్ కింద రూ.389.73 కోట్ల వ్యయంతో 287.50 కిలోమీటర్ల పొడవునా 16 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.
ఫ ఉమ్మడి జిల్లాలో 60 రహదారుల విస్తరణ
ఫ హైబ్రీడ్ అన్యూటీ మోడ్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి
ఫ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ఫ టెండర్లను పిలిచేందుకు అధికారుల కసరత్తు