
స్వచ్ఛ సర్వేక్షణ్లో నీలగిరికి 355వ ర్యాంక్
నల్లగొండ టూటౌన్ : కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను గురువారం ప్రకటించింది. మూడు లక్షలలోపు జనాభా కేటగిరిలో నీలగిరి మున్సిపాలిటీ 355వ ర్యాంకు సాధించింది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో 56వ ర్యాంకు సొంతం చేసుకుంది. చెత్త ప్రాసెసింగ్, ఇంటింటి చెత్త సేకరణలో మెరుగైన ఫలితాన్ని రాబట్టింది. డంపింగ్ యా ర్డులో చెత్త రీసైక్లింగ్ పెండింగ్ కారణంగా జాతీయస్థాయి ర్యాంకులో కాస్త వెనుకబడింది. ఉమ్మడి జిల్లాలో పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణలో ప్రతి సంవత్సరం ముందంజలో నిలుస్తున్నప్పటికీ, డంపింగ్ యార్డ్ చెత్త కారణంగా ఆశించిన స్థాయిలో ర్యాంకు సాధించలేకపోయింది.
నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ రఘువర్ధన్ సస్పెన్షన్
నల్లగొండ : నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ రఘువర్ధన్పై సస్పెన్షన్ వేటు పడింది. చిట్యాలకు చెందిన ఓ బాలిక పేరున ఉన్న 121 గజాల భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన విషయంలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ 2పైన కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినా.. పాత పద్ధతిలోనే అక్రమాలు జరుగుతుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నలుగురు ఎంపీడీఓలకు పోస్టింగ్ ఆర్డర్లు
నల్లగొండ : ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు బదిలీపై వచ్చిన నలుగురు ఎంపీడీఓలకు గురువారం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చిన బి.యాకుబ్నాయక్ను నల్లగొండ ఎంపీడీఓగా, డి.జితేందర్రెడ్డిని వేములపల్లి ఎంపీడీఓగా, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన జె.వెంకటేశ్వర్రావును నకిరేకల్ ఎంపీడీఓగా, సంగారెడ్డి నుంచి వచ్చిన ఎస్.సుధాకర్ను తిప్పర్తి ఎంపీడీఓగా నియమించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు కొప్పు రాంబాబు, ఇతర అధికారులు ఉన్నారు.
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.22,90,630
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడిగా 34 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను గురువారం లెక్కించారు. మొత్తం 22,90,630 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ నవీన్కుమార్ తెలిపారు. అన్నదానం హుండీని లెక్కించగా రూ65,120 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, రాజయ్య, వెంకటయ్య, రాజలక్ష్మి, వంశీ, నరేష్, చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, డైరెక్టర్లు మారుపాక ప్రభాకర్రెడ్డి, పసునూరి శ్రీనివాస్, వంపు శివశంకర్, రాధారపు భిక్షపతి, బొబ్బలి దేవేందర్, మేక వెంకట్రెడ్డి, కృష్ణయ్య, కొండేటి వేణు, యాదయ్య, యాదగిరి, శ్రీను, శంకరయ్య, మల్లేష్ పాల్గొన్నారు.
సైకిల్ యాత్రను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్, లోన్ యాప్లను అరికట్టాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ కోరారు. సైకిల్యాత్ర కరపత్రాలను గురువారం నల్లగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకిల్ యాత్ర ఈ నెల 24 నుంచి నకిరేకల్లో ప్రారంభమై, ఆగస్టు 2న మిర్యాలగూడలో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు వడ్డగాని మహేష్, కట్ట లింగస్వామి, బి.లింగరాజు, అలివేలు పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్లో నీలగిరికి 355వ ర్యాంక్