నల్లగొండ : పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ముడ్ రిజర్వు సిబ్బందికి నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీస్ల పాత్ర కీలకమన్నారు. జిల్లాలో సాయుధదళ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
సిబ్బంది వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నిరంతరం విధుల్లో ఉండే సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబ పరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు తాను ముందుంటానని ఎస్సీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏవో శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, సూరప్పనాయుడు, శ్రీనివాస్, హరిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సహకార సంస్థలను అనుసంధానించాలి
నల్లగొండ టౌన్ : సహకార సంస్థలను జాతీయస్థాయిలో అనుసంధానం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో పాడి సహకార సంఘాలను డీసీసీబీలతో అనుసంధానం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–2026ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. సహకార సంఘాలను అనుసంధానం చేయడం వల్ల సహకార వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పాడి సహకార సంఘాలు డీసీసీబీలో సేవింగ్ ఖాతా ఓపెన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, బ్యాంకు డీజీఎంలు, ఏజీఎంలు పాల్గొన్నారు.

సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి