
వేగంగా ఇరిగేషన్ పనులు
ఫ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ పనులు వేగంగా చేపట్టి అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం సేకరించిన కలెక్టర్లను, ప్రత్యేకించి నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. వచ్చే సీజన్ నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం శుభ్రపరిచే, ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని పేర్కొన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో సన్నబియ్యంతోపాటు, ఇతర రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో ఫారెస్ట్ భూములన్నింటికి తిరిగి పచ్చదనం తెచ్చేలా తన కోటా నుంచి నిధులు ఇస్తానని ప్రకటించారు. విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఉండొద్దన్నారు.