
ముమ్మరంగా సాగర్ క్రస్ట్గేట్ల మరమ్మతు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్గేట్లు మరమ్మతుల పనులను అధికారులు ముమ్మరం చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 590 అడుగులుకాగా.. 546 అడుగుల నుంచి 26 రేడియల్ క్రస్ట్గేట్లు ఉంటాయి. స్పిల్వేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన వాక్వే బ్రిడ్జి మీదుగా వెళ్లి మరమ్మతు పనులు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తిచేసి.. క్రస్ట్గేట్లను ట్రయల్ రన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు గేట్లకు పట్టిన తుప్పును వదిలించడంతో పాటు క్రాక్లు, వంకరలు తిరిగిన వాటిని గుర్తించి సరిచేయడం, వెల్డింగ్ జాయంట్లను గుర్తించి బలంగా లేని చోట్ల తిరిగి వెల్డింగ్ పెట్టడం లాంటి పనులు చేశారు. తుప్పు నివారణకు యాంటీ కరోషన్ పెయింటింగ్ వేయడం, హైడ్రాలిక్ స్ట్రక్చర్ల కోసం ప్రత్యేకంగా తయారైన పెయింట్లను వేసే పనులు చేస్తున్నారు. గతేడాది వరదలు అధికంగా వచ్చి పలుమార్లు ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రబ్బరు సీళ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి మార్చుతున్నారు. పాతవి పనికి వచ్చే దగ్గర వాటిని వంకరలు తీసి మళ్లీ వేస్తున్నారు. గేట్లను ఎత్తేందుకు వినియోగించే ఇనుపత్రెడ్కు గ్రీజింగ్, ఆయిలింగ్ చేస్తున్నారు. అలాగే గేట్లను ఎత్తేందుకు వినియోగించే మోటర్లకు సంబంధించిన స్టార్టర్లు, గేర్బాక్సులు, కుబుల్స్ తదితర సామగ్రిని తనిఖీ చేస్తున్నారు. విద్యుత్ సరఫరా అయ్యే ప్యానల్ బోర్డుల్లో గల సామగ్రినంత చెక్ చేస్తున్నారు. అనుమానాలున్న చోట్ల స్ట్రక్చరల్ ఆడిట్ (ఐఐటీ, ఎన్డీఎస్ఏ వంటి సంస్థలతో) చేయిస్తారు. మరమ్మతు పూర్తికాగే గేట్లను డ్రైరన్ చేస్తారు.
ఫ రెండు మూడు రోజుల్లో ట్రయల్రన్