
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
ప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలను ఎలా గుర్తించాలి?
– గపూర్, నకిరేకల్, వినయ్కుమార్,
కురంపల్లి, కనగల్ మండలం,
జేడీఏ : ప్రభుత్వ లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి. కోనేటప్పుడు ప్యాకెట్ ధర, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, లాట్ నంబర్, కంపెనీ పేరు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది గమనించాలి. అన్ని సక్రమంగా ఉంటేనే అసలైన విత్తనాలు. అవి లేకపోతే నకిలీవని గుర్తించాలి. ధర ప్యాకెట్కు రూ.901 మాత్రమే ఎక్కువ ధరకు అమ్మినా, ఎలాంటి అనుమానాలు ఉన్నా వ్యవసాయ అఽధికారులకు తెలియజేయాలి. విత్తనాల కొన్నాక తప్పకుండా రశీదుని తీసుకుని దాన్ని పంటల సాగు సీజన్ సమయం ముగిసే వరకు భద్రంగా ఉంచుకోవాలి.
నల్లగొండ అగ్రికల్చర్ : ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు కురవడంతో రైతులు సాగు పనులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చే నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పాల్వాయి శ్రవణ్కుమార్ సూచించారు. అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి రశీదు తప్పకుండా పొందాలి.. మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలని అంటున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు గురువారం సాక్షి ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. రైతులు వెలిబుచ్చిన సందేహాలను జేడీఏ సావదానంగా విని నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి పి.అనంతరెడ్డి, కేవీకే కంపాసాగర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాస్, సైంటిస్టు కె.సంధ్యారాణి, మండల వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాస్, టెక్నికల్ ఏఓ కీర్తి, స్టెనోగ్రాఫర్ పాల్గొన్నారు.
ప్రశ్న : వర్షాలు కురిసినందున ఇప్పుడు పత్తి విత్తనాలను విత్తుకోవచ్చా?
– బండి ఆంజనేయులు, అడవిదేవులపల్లి
జేడీఏ : దుక్కులు దున్నుకోనివారు దుక్కులను దున్నుకోవాలి. దున్నుకుని సిద్ధంగా ఉన్న రైతులు మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలి.
ప్రశ్న : నందిపాడు సీడ్స్ కార్పొరేషన్ నుంచి జనుము విత్తనాలను అందుబాటులో ఉంచాలి?– ఇంద్రారెడ్డి, నిడమనూరు
జేడీఏ : తప్పక మీ మండల కేంద్రంలో రేపటి వరకు జనుము, ఇతర వరి విత్తనాలను సీడ్స్ కార్పొరేషన్ ద్వారా అందుబాటులో ఉండేలా చూస్తాం.
ప్రశ్న : వానాకాలం వరినారు పోసుకోవచ్చా.. ఎప్పటి వరకు నాట్లు వేసుకోవాలి?
– శ్రీశైలం దోరెపల్లి, కనగల్ మండలం
జేడీఏ : దొడ్డురకం కేఎన్ఎం 118, రకం, బీపీటీ సన్నాలతో నారు పోసుకోవచ్చు, ఆగస్టు 15 వరకు వరినాట్లు పూర్తి చేసుకోవాలి.
ప్రశ్న : డీఆర్ఆర్ వరిరకం విత్తనాలు ఇస్తున్నారా?
– నర్సిరెడ్డి, వెలుగుపల్లి, నల్లగొండ మండలం
జేడీఏ : డీఆర్ఆర్ రకం వరి విత్తనాలు మినికిట్లు వచ్చాయి. అయిపోయాయి. మళ్లీ రాగానే సహకార సంఘాల ద్వారా ఇప్పిస్తాం.
ప్రశ్న : భూసార పరీక్షలను చేసి కార్డులను ఇవ్వడం లేదు. అసలు పరీక్షలు చేస్తున్నారా?
–కోట వెంకటేశ్వర్రావు, చీకటిగూడెం
జేడీఏ : పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి తప్పకుండా భూసార పరీక్షలను చేసి రైతులకు కార్డులను అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిస్తాం.
ప్రశ్న : రైతు విశిష్ట కార్డులు తీసుకోవాలా.. వద్దా?–సైదులు, అన్నెపర్తి
జేడీఏ : మనకు ఆధార్ కార్డులు ఎలాగో భూములకు విశిష్ట కార్డులు అవసరం. తప్పకుండా వాటిని తీసుకోవాలి. ఏఈఓలు గ్రామాలకు వచ్చి నమోదు చేసుకుంటున్నారు.
ఫ అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి
ఫ ముందస్తు వర్షాలతో
వరినార్లు పోసుకోవచ్చు
ఫ మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలి
ఫ ‘సాక్షి ఫోన్ఇన్’లో రైతులకు
జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్కుమార్ సూచన
ప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని అరికట్టి రైతులను కాపాడాలి?
–బ్రహ్మయ్య, అడవిదేవులపల్లి
జేడీఏ : ఆంధ్రా ప్రాంతం నుంచి నకిలీ పత్తి విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. అదేవిధంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి దాడులను చేయిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలి.
ప్రశ్న : ఈ వానాకాలంలో ఏరకం వరి విత్తనాలు సాగు చేసుకోవాలి
– జానయ్య, రమేష్రెడ్డి, తిప్పర్తి, ఈశ్వర్, జీకే అన్నారం, నల్లగొండ మండలం
జేడీఏ : ముందుస్తుగా కురిసిన వర్షాల వల్ల వరినార్లు పోసుకోవచ్చు. సన్నాలైన బీపీటీ, దొడ్డురకమైతే కేఎన్ఎం118 రకం వరి విత్తనాలు విత్తుకోవచ్చు. విత్తనాలు కేవీకే కంపాసాగర్లో అందుబాటులో ఉన్నాయి. సన్నాల సాగుకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ను సద్వినియోగం చేసుకోవాలి.