
నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు.
డిండి విద్యార్థులకు
సీఎం అభినందనలు
డిండి: డిండి అథ్లెటిక్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పది మంది విద్యార్థులను బుధవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన ఫెలిసిటేషన్ సెర్మోనీ–2025 కార్యక్రమంలో సీ ఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందించి అభినందించారు. ఇందులోభాగంగా డిండి మండల కేంద్రానికి చెందిన అవుల అఖిల, నారిమళ్ల ప్రవళిక ఉన్నారు. వీరికి సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, కోచ్ పరశురాం అభినందనలు తెలిపారు.
రికార్డుల నిర్వహణ
పక్కాగా ఉండాలి
చండూరు: కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన చండూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో మాట్లాడి రికార్డులు, కార్యకలాపాలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ యాదగిరి, సూపరింటెండెంట్ నర్సింహ, సిబ్బంది ఉన్నారు.
స్పోర్ట్స్ కోటాలో
ఉద్యోగాలు సాధించాలి
నకిరేకల్ : హ్యాండ్బాల్ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కుంభం నర్సిరెడ్డి అన్నారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో కొనసాతుతున్న హ్యాండ్బాల్ బాలబాలికల ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో మాట్లాడారు. జూన్ 4 నుంచి 6 వరకు మంగళపల్లిలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్బాల్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ ఉస్మాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభేషికం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం నిర్వహించారు.

నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష

నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష