
నకిలీ విత్తనాలు రాకుండా కట్టడి చేయాలి
నల్లగొండ: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు రవాణా కాకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. జిల్లాలో వరి, పత్తి, ఇతర ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టేవారిపై నిఘా ఉంచాలన్నారు. రైతులు అనుమతి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలని, లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని సూచించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు వ్యవసాయాధికారుల దృష్టికి వస్తే పోలీసుల సహకారం తీసుకుని దాడులు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి