సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి

May 21 2025 1:33 AM | Updated on May 21 2025 1:33 AM

సౌరశక

సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి

కట్టంగూర్‌ : సౌరశక్తి వినియోగంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలంలోని అయిటిపాముల గ్రామంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆర్థికసాయంతో స్వబాగ్‌ ల్యాబ్స్‌ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్‌ గ్రిడ్‌ కోఆపరేటివ్‌ సోలార్‌ బ్యాటరీ యూనిట్లను మంగళవారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్‌ ప్యానల్‌తో విద్యుత్‌ను స్టోరేజీ చేసి ఆదాయం సంపాదించేందుకు దేశంలోనే మొదటిసారిగా అయిటిపాములలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్‌ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వశక్తితో మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా 50 మంది స్వయం సహాయక మహిళలకు రూ.50 లక్షలు ఇచ్చామని తెలిపారు. త్వరలో ఈ 50 మంది మహిళలకు బ్యాంకు ద్వారా మూడు లక్షల రూపాయల చొప్పున బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఒప్పంద పత్రాలు అందజేత

రాజీవ్‌ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున జూన్‌ 2న అందించనున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో అయిటిపాముల మాదిరిగానే నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామంలో సోలార్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. అయిటిపాములలో 100 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఒక్కొక్కరికి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం మహిళలకు రూ.10 లక్షల చెక్కు, స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మహిళలు సోలార్‌ ప్యానెల్‌ను సద్వినియోగం చేసుకుని ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. సోలార్‌ విద్యుత్‌ యూనిట్ల ద్వారా మహిళలకు నెలకు రూ.2 వేలు ఆదాయం లభిస్తుందని తెలిపారు. మంత్రి చొరవతో రూ.100 కోట్లతో అయిటిపాముల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేయించామని, పైపులైను పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యుత్‌ యూనిట్లకు కోతుల బెడద లేకుండా సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని స్వబాగ్‌ ల్యాబ్స్‌ యజమాన్యాన్ని కోరారు.

మహిళలు ఇంటి నుంచే ఆదాయం పొందేలా

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళలు ఇంటి నుంచే ఆదాయం పొందేలా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేశామన్నారు. సోలార్‌ విద్యుత్‌ బ్యాటరీ జీవిత కాలం 10 సంవత్సరాలు పనిచేస్తుందన్నారు. 50 మందితోపాటు గ్రామంలోని మిగతా మహిళలను బ్యాటరీ ఏర్పాటులో భాగస్వాములను చేస్తామన్నారు. స్వలాబ్‌ ల్యాబ్స్‌ సీఈఓ సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 50 మంది మహిళలకు రూ.50 లక్షలు అందించి ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ బ్యాటరీ దేశంలోనే మొదటిదని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, విద్యుత్‌కు బదులుగా ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చన్నారు. తామే బ్యాటరీలను కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎఫ్‌పీఓ చైర్మన్‌ చెవుగోని సైదమ్మ మాట్లాడుతూ సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు ప్రభుత్వం యూనిట్‌కు రూ.3 నుంచి 3.50 రూపాయలు ఇస్తుండగా, స్వబాగ్‌ ల్యాబ్స్‌ వారు యూనిట్‌కు రూ.16.50 చెల్లిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి డీసీఎంఎస్‌ చైర్మన్‌ బోళ్ల వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అమిత్‌ నారాయణ, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్‌రావు, ఆర్‌డీఓ వై.అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, మాజీ జెడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, ఎఫ్‌పీఓ చైర్మన్‌ సైదమ్మ, ఏపీఓ రాంమోహన్‌ ఉన్నారు.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నెలకు రూ.2వేల ఆదాయం వస్తోంది

ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్‌ సహకారంతో మా ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ఆఫ్‌ గ్రిడ్‌ కోఆపరేటివ్‌తో నెలకు రూ.2 వేల ఆదాయం వస్తోంది. ఇప్పటికే రెండు నెలల డబ్బులు నా ఖాతాతో జమ అయ్యాయి. సోలార్‌ ప్లేట్‌ల క్లీనింగ్‌ తప్ప ఎలాంటి రిస్క్‌ లేదు. ప్రతి నెల రూ.2 రావడంతో ఇంట్లో చిల్లర ఖర్చులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.

– పసునూరి విజయలక్ష్మి, అయిటిపాముల

సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి1
1/2

సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి

సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి2
2/2

సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement